కరోనా ఎఫెక్ట్: నిరవధికంగా వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ

  • పెరుగుతున్న కరోనా వ్యాప్తి
  • అసెంబ్లీలో 52 మందికి పాజిటివ్
  • బీఏసీ సూచనలకు అనుగుణంగా వాయిదా నిర్ణయం తీసుకున్న స్పీకర్
గత కొన్నిరోజులుగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఓవైపు కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో బీఏసీ సూచనలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఓ ఎమ్మెల్యే సహా 52 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు, గన్ మన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారంకు నివేదించారు. దాంతో ఆయన బీఏసీ సమావేశం నిర్వహించి పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు.

 ఈ క్రమంలో వచ్చిన సూచనల మేరకు అసెంబ్లీ నిరవధిక వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు సాఫీగా సాగేందుకు సహకరించిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈసారి సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. చారిత్రాత్మక నూతన రెవెన్యూ చట్టం బిల్లుకు ఆమోదం లభించింది. అంతేకాదు, విప్లవాత్మక మార్పులతో కూడిన తెలంగాణ బీ పాస్ చట్టం బిల్లు కూడా సభ ఆమోదం పొందింది.

Telangana Assembly
Adjourned
Corona Virus
Pocharam Srinivas
Speaker
BAC

More Telugu News